YSRCP Vs TDP Pattiseema Projectముఖ్యమంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పూర్తి చేయ‌లేని ప‌నుల‌ను ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నార‌ని టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్‌ ఖాన్ అభిప్రాయ పడ్డారు. పులివెందులలో వైఎస్‌ కుటుంబం ‘రక్తపాతం’ కార్చేలా చేస్తే, ఇప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబు మాత్రం ‘జలపాతాలు’ పారిస్తున్నారని అన్నారు. వైసీపీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గత ఆరు నెలలుగా పనీపాటా లేకుండా తిరుగుతూ, ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై త‌రచూ నోరుపారేసుకుంటున్నార‌ని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్ర‌బాబును బంగాళాఖాతంలో కలిపేస్తానని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జలీల్ ఖాన్, చివరికి జ‌గ‌న్‌ నే ప్రజలు నల్ల సముద్రంలో కలిపేస్తారని వ్యాఖ్యానించారు. టీడీపీ స‌ర్కారు పట్టిసీమను పూర్తి చేయ‌డంతో 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా నిల‌బ‌డిందని, నాడు కేవీపీ కమీషన్ల‌ కోసం జల యజ్ఞానికి, ప్రభుత్వ పథకాలకు మ‌ధ్య ఓ ద‌ళారిలా పని చేశార‌ని ఆరోపణలు గుప్పించారు. విజయవాడ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హీట్ పెంచాయి.