మే 23న ఓట్ల లెక్కింపు సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. అందువల్ల కౌంటింగ్ సెంటర్ల వద్ద కేంద్ర బలగాలను నియమించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుండీ రాష్ట్ర పోలీసులను నమ్మని సంగతి అందరికీ తెలిసిందే.
అయితే జగన్ కు గానీ విజయసాయిరెడ్డికి గానీ కేంద్ర బలగాల మీదే ఎందుకు అంత నమ్మకం అనేది అంతు చిక్కని ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన కేంద్రం పై అంత నమ్మకం ఏంటో? మోడీ ప్రభావంతో కేంద్ర బలగాలు వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చెయ్యవా? చెయ్యవు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ కు, బీజేపీకు ఏదో లోపాయకారి ఒప్పందం ఉందనే అనుకోవాలా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యల బట్టి అటువంటి అనుమానాలు కలుగకమానవు.
రాష్ట్రంలో ఒకపక్క వైఎస్సార్ కాంగ్రెస్ గాలి వీస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. సహజంగా అటువంటి పరిణామాన్ని మొదట పసిగట్టేది క్షేత్రస్థాయిలో పని చేసే పోలీసులే. అటువంటి పోలీసులు ఆఖరి నిముషం అంటే కౌంటింగు రోజు కూడా ఓడిపోయే తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తారు? అంటే విజయసాయి రెడ్డి లేఖను బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ కు గెలుపు మీద నమ్మకం లేదు అనే అనుకోవాలా? ఇప్పటి నుండే ఓటమికి వంకలు వెతుకుతున్నారు?