వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన కుప్పం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడు దశాబ్దాలుగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో ఆ పార్టీ ప్రాభవానికి గండికొట్టాలని వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారు.
ఆ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జిగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను వైకాపా అధిష్ఠానం నియమించింది. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లూ మార్చినట్లు సమాచారం. 1989 ఎన్నికల్లో చంద్రబాబు తొలిసారి కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ సమయంలో గుడుపల్లె మండలంలో భారీ మెజార్టీ వచ్చింది. అప్పటినుంచి ఆ మండలాన్ని తన హృదయానికి దగ్గరైన ప్రాంతంగా బాబు అభివర్ణిస్తున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల వరకూ చంద్రబాబు ఇక్కడ వరుసగా ఏడు సార్లు గెలిచారు. ఇటీవలే ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు ఈ విషయాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలే కుప్పంలో బహిరంగసభ పెట్టి దానికి జనసమీకరణ చెయ్యలేక అధికార పార్టీ వారు అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలలో ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఆసక్తిగా ఉంది.