రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లలో విజయం. ఉన్న పాతిక ఎంపీ సీట్లలో ఇరవై రెండూ …. ఏ రకంగా చుసిన అనితరసాధ్యమైన విజయమే. సహజంగా ఇరువంటి ఫలితం సాధించిన ఏ పార్టీ అయినా సర్వశక్తిమంతం అయిపోతుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం ఒకింత భయంగానే గడుపుతుంది కారణం కేంద్రంలోని బీజేపీ. 2014 ఎన్నికల ముందు పొత్తుతో ముందుకు వెళ్లిన టీడీపీనే ముంచేశారు నరేంద్ర మోడీ – అమిత్ షా ద్వయం.
చంద్రబాబుకు సహాయనిరాకరణ చేసి ఆ తరువాత ఆయనను పొగ బెట్టి బయటకు పంపి తమ అధికార బలంతో ఓడించారు. అదే ఎన్నికలలో 2014 కంటే మెరుగైన ఫలితాలతో తిరిగి అధికారంలోకి వచ్చింది బీజేపీ. నెక్స్ట్ టార్గెట్ తామే అని జగన్, విజయసాయి రెడ్డిలకు, దానితో ఎందుకైనా మంచిదని జగన్ ఎప్పుడూ లేనిది ప్రధాని కాళ్ళ మీద పడ్డారు. అయినా బీజేపీ ఊరుకునేలా లేదు. రాష్ట్ర నాయకులతో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో చంద్రబాబుకు ఒకప్పుడు బాగా దగ్గరైన సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలో చేరిపోయారు. వారు తమ లాభం తాము చూసుకున్నా చంద్రబాబుని వారు మోసం చేశారంటే జగన్, విజయసాయి రెడ్డిలకు నమ్మకం కలగడం లేదు. వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపి తమను ఇబ్బంది పెట్టెలా చేస్తున్నారని వారి అనుమానం. దానితో బీజేపీ నేతలు తమ ప్రభుత్వాన్ని తిట్టినా విజయసాయి రెడ్డి ఆ ఇద్దరినే తిడతారు. బీజేపీ అధ్యక్షుడిగా చంద్రబాబు వ్యతిరేకైన కన్నా లక్ష్మీనారాయణను తప్పించి టీడీపీకి అనుకూలమైన వారిని ఆ ఇద్దరూ నియమింపచేస్తారని తాజాగా విజయసాయి రెడ్డి అనుమానం. మొత్తానికి భారీ విజయం లభించినా వైఎస్సార్ కాంగ్రెస్ కు సుఖం లేదు.