వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇప్పటికే పది జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసిన ఆయన చివరి ఘట్టంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ప్రజా సంకల్పయాత్రకు ఈ నెల 14న శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్ట వద్ద నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది.
జగన్ నియోజకవర్గంలో వారం రోజులు పాదయాత్ర నిర్వహించి, సోమవారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అయితే నర్సీపట్నంలో పాదయాత్ర అనంతరం పరిణామాలు పార్టీకి నష్టం కలిగించేవిగా మారాయి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడుకు గట్టి పోటీ ఇచ్చిన గణేష్కే మళ్లీ టిక్కెట్టు ఇస్తారంటూ ప్రచారం జరిగినా ప్రకటన మాత్రం రాలేదు.
నియోజకవర్గంలో వారం రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన జగన్ కనీసం నర్సీపట్నం బహిరంగ సభలో కూడా గణేష్ను అభ్యర్థిగా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. గణేష్ ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు. ఓడిపోయినా సరే ఆయన నియోజకవర్గంలో చురుకుగా ఉండేవారట.