గతంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పై ఆపరేషన్ ఆకర్ష ప్రయోగించి 20 వరకు ఎమ్మెల్యేలను టీడీపీ చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సైకిల్ పార్టీపై ప్రతిపక్ష పార్టీ ఆపరేషన్ రివర్స్ ఆకర్ష ప్రయోగించిందని సమాచారం. తెలంగాణ ఎన్నికల ముగిసిన అనంతరం దూకుడు పెంచింది. రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ద్వారా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి ఫోన్లు చేసి తెలంగాణ ఫలితాలే ఆంధ్రప్రదేశ్ లో కూడా పునరావృతం అవుతాయని, టీడీపీ మూడవ స్థానంలోకి పడిపోయినా పడిపోవచ్చని ఈ లోగానే జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నారట. ఆయన ప్రమేయంతో కొన్ని జిలాలలో ఇప్పటికే ఒకరిద్దరు చిన్న నాయకులు వైసీపీలో చేరగా, మరో ఇద్దరు, ముగ్గురు నేతలతో ప్రస్తుతం ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్ద చేపలకోసం విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
దీంతో విజయసాయిరెడ్డి కదలికలపై టీడీపీ అధిష్ఠానం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. అయితే జనసేన కానీ వైకాపా కానీ తమ పార్టీలో టిక్కెట్టు లేని వారినే లాక్కొనగలవాని పెద్ద నేతలు ఎవరు వెళ్లారని అధికార పార్టీ ధీమాగా ఉంది. వైకాపా మాత్రం తెలివిగా పావులు కదుపుతుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో స్థానికంగా చాలా చోట్ల ఆ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. తదనుగుణంగా పార్టీలోకి దీటైన అభ్యర్థులను చేర్చుకునే చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా టీడీపీతో పాటు, ఇతర ఏపార్టీలో కానీ, స్వతంత్రంగా కానీ ఉన్న బలమైన నేతల కోసం అన్వేషిస్తోంది. 2019లో కొంత మంది సీనియర్ నేతలు, సిట్టింగు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఏం జరగబోతుంది అనేది అంతటా ఆసక్తికరంగా ఉంది. సహజంగా ఎన్నికలలో ఊపు ఎటు ఉంది అనేది జంప్ జిలానిల కదలికల బట్టి కూడా తెలుస్తుంది. 2019 మొదట్లో దాని బట్టి మనం ఒక ఐడియాకు రావొచ్చు.