టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంతటి అగాధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పబ్లిక్ లో వారు రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా ఆగర్భశత్రువులుగా ప్రవర్తిస్తారు. అయితే టీడీపీ ఎంపీని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొగడ్తలతో ముంచెత్తిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే … విజయవాడ ఎంపీ కేశినేని నానిని మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి కారణం ఉన్నది. మైలవరం నియోజక వర్గంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిధులు అవసరం అయ్యాయి. ఈ విషయం నానికి చెప్పగా అయన వెంటనే తన ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇచ్చారట.
ఆ నిధులతో మైలవరం నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయబోతున్నారు. అలానే కేశినేని నాని మైలవరం నియోజక వర్గంలోని ఓ గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా శత్రుత్వం ఉన్నప్పటికీ ప్రజలకు మంచి చేసే విషయంలో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే అంటున్నాడు.
ఇదంతా బానే ఉంది నాని చేసిన పనికి వసంత కృష్ణప్రసాద్ ప్రత్యర్థి, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయనకు కేశినేని నానికి అంతరం ఉన్న సంగతి జిల్లాలో రాజకీయాల గురించి తెలిసిన వారందరికీ సుపరిచితమే.