వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురు అయ్యింది. నగరి లో జరిగిన గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి రోజా వచ్చారు. అయితే ఆమెను వారి పార్టీ కార్యకర్తలే అడ్డుకోవడం విశేషం. టీడీపీ నుంచి వచ్చినవారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నామినేటెడ్ పదవులు కూడా వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో దశాబ్దం పాటు కష్టపడినా దానికి విలువ లేకుండా పోయిందని వాపోయారు. కార్యకర్తలు రోజా ను అడ్డుకోవడంతో అక్కడ కొద్ది సేవు పాటు గందరగోళం నెలకొంది. దీనితో పోలీసులు కలగజేసుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యేను ఊరిలోకి రాకుండా పుత్తూరు మండలం కేబీఆర్ పురం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అని తెలుస్తుంది. రోజా వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షం లో ఉండగా అప్పటి అధికార పార్టీతో అలుపెరుగని పోరాటం చేశారు.
అయితే నియోజవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తారని ఆమె మీద ఆరోపణలు ఎప్పుడూ ఉంటాయి.అయినా జగన్ వేవ్ వల్ల ఇటీవలే ఎన్నికలలో మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. జగన్ కేబినెట్ లో స్థానం ఆశించినా అది కుదరలేదు. జగన్ ఆమెకు ఏపీఐఐసి ఛైర్మన్ పదవి ఇచ్చారు.