వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎట్టకేలకు దిగొచ్చారు. అసెంబ్లీలో సభా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై నిండు సభ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. సారీ చెబితే వదిలేస్తామన్న సర్కారు ఫీలర్లకు ససేమిరా అన్న రోజా… ఇటు హైకోర్టులోనే కాకుండా అటు సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేశారు.
అయితే ఎక్కడా ఆమెకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో చివరకు సారీ చెప్పేందుకే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా రోజా రాసిన క్షమాపణ లేఖ గురువారం నాడు స్పీకర్ కార్యాలయానికి చేరింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రోజా కామెంట్లకు టీడీపీ ఎమ్మెల్యే అనిత నిండు సభ సాక్షిగా కంటతడి పెట్టుకున్న విషయాన్ని కూడా రోజా తన క్షమాపణ లేఖలో ప్రస్తావించారు. నాడు తాను చేసిన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే… ఆమెకు కూడా సారీ చెబుతున్నట్లు రోజా సదరు లేఖలో పేర్కొన్నారు.
మరి ఈ సారీపై వైసీపీ అధినేత జగన్ వర్యులు ఎలా స్పందిస్తారో? నాడు రోజాను వెనుకేసుకుని వచ్చిన జగన్, అసలు రోజమ్మ ఎలాంటి తప్పు చేయలేదని కితాబిచ్చారు. మరి ఎలాంటి తప్పు చేయకుండా సారీ చెప్తే పార్టీ అధినేత ఒప్పుకుంటారా? అపరిపక్వ రాజకీయాలకు జగన్ నిదర్శనం అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పెద్ద తరహాగా, వైసీపీ అధ్యక్షుడిగా నాడే హుందాగా ప్రవర్తించి, రోజా చేత ఆ రెండు అక్షరాలు పలికించి ఉన్నట్లయితే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా!? ఇంతకాలం వేచిచూసినా… ఆ రెండక్షరాలు చెప్పక తప్పలేదు… తప్పు ఒప్పుకోక తప్పలేదు..!