విశాఖపట్నం గ్యాస్ లీకేజీ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వ్యవహారం మొదటి నుండీ అభ్యంతరకరంగానే ఉంది. ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఎయిర్ పోర్టులో దిగీ దిగగానే బాధితులను కలవడానికి వెళ్లకుండా కంపెనీ ప్రతినిధులను కలవడంతో వివాదం మొదలయ్యింది. ఆ తరువాత కంపెనీని ఒక్క మాట కూడా అనకుండా బాధితులను భారీ నష్టపరిహారంతో సైలెంట్ చెయ్యాలని చూశారు.
ఆ పార్టీ నేతలు ఏమైనా ఆదేశాలతో చేశారో లేక స్వయంగా చేశారో పదే పదే కోటి రూపాయిలు లంచం కోటి రూపాయిలు ఇచ్చాం అని చెప్పుకోవడంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ప్రాణాలకు డబ్బులతో వెలకడుతున్నారా అనిపించింది. అయినా ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం వీడలేదు.
సాక్షి టీవీలో కొమ్మినేని డిబేట్ అంటే అధికార పార్టీ నేతలు చెలరేగిపోతాడు. అక్కడ యాంకర్ తో సహా అందరూ పార్టీ భజన చేసే వారే కావడంతో వారికి అడ్డు ఆపు ఉండదు. తాజాగా ఈ షోలో చోడవరం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి.
జగన్ ఇచ్చిన కోటి రూపాయిల గురించి పొగిడేస్తూ… “జగన్ ఇచ్చే కోటి రూపాయల కోసం మా కుటుంబ సభ్యులు కూడా చనిపోతే బాగుండే, అని ఒకరిద్దరు అనుకుంటున్నారు,” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.