YSRCP_Kotamreddy-Sridhar-Reddy-Responds-House-Arrestవచ్చే ఎన్నికలలో 175 సీట్లు మావే అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటుంటే, “నెల్లూరు జిల్లాలో 10 సీట్లు గెలుచుకొన్నా ఏం పీకారు?” అని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి జిల్లాలో 10 స్థానాలలో గెలిపిస్తే, ఈ నాలుగేళ్ళలో కనీసం తన నియోజకవర్గంలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాను పార్టీలో ఉన్నప్పుడు పదేపదే నియోజకవర్గంలో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి నిధులు విడుదల చేయాలని ఒత్తిడి చేసేవాడినని అన్నారు. చివరికి తన గోల భరించలేక సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన నియోజకవర్గంలో పర్యటించి పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయకుండా తనను, తన నియోజకవర్గం ప్రజలను మోసగించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనుక కలుజు వంతెన నిర్మాణం కోసం తక్షణం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కలుజు వద్ద జలదీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన ఇంట్లో నుంచి బయలుదేరేలోగా భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకొని జలదీక్షకు అనుమతి లేదంటూ ఆయనను అడ్డుకొని గృహనిర్బందం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలు, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజలు అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ దశాబ్ధాలుగా వైఎస్సార్ కుటుంబం వెన్నంటి ఉంది, నిన్న మొన్నటివరకు వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడితే, అవన్నీ కళ్ళకు కనబడుతున్న వాస్తవాలే కనుక నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఆయనతో ఏకీభవిస్తారు. దాని వలన వైసీపీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. అందుకే జలదీక్షకు అనుమతి లేదంటూ గృహనిర్బందం చేశారని భావించవచ్చు.

అయితే ఇది రాష్ట్రంలో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే పరిమితమైన సమస్య కాదని వైసీపీ ఎమ్మెల్యేలందరికీ తెలుసు. కానీ నియోజకవర్గం అభివృద్ధి గురించి తమ అధినేతను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాగ గట్టిగా నిలదీయలేరు. నిలదీస్తే తమకి కూడా ఆయనకు పట్టిన గతే పడుతుందని వారికీ తెలుసు. అందుకే విశాఖ రాజధాని అయితేనే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందుతుందని, మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలివిగా చెపుతున్నట్లున్నారు.