ysrcp-mla-govardhan-reddy-tv9-show-gone-viralవారాంతపు కార్యక్రమంలో భాగంగా ఓ ప్రముఖ టెలివిజన్ లో ప్రసారమయ్యే ‘ముఖాముఖి’ సరికొత్త రూపు సంతరించుకుని, ‘ప్రజాదర్బార్’ మాదిరి నిర్వహించారు. ఓ వైపు అనుచరవర్గం, మరో వైపు ప్రజలను కూర్చోబెట్టి నెల్లూరు జిల్లా, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి (వైసీపీ ఎమ్మెల్యే)తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ వర్గం చేసిన దౌర్జన్యకాండ మీడియాలలో ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది.

కాకాని గోవర్ధనరెడ్డిపై వచ్చిన అనేక ఆరోపణలను, కేసులను చార్జ్ షీట్లతో సహా సదరు మీడియా ప్రతినిధి కెమెరాల ముందు పెట్టి ప్రశ్నించగా, గోవర్ధనరెడ్డిపై ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రజలకు ప్రశ్నించే అవకాశాలను ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నలు వ్యక్తమవుతున్న సందర్భంలో… వైసీపీ అనుచరవర్గం ఒక్కసారిగా విరుచుకుపడింది. అంతేకాదు అన్ సెన్సార్డ్ భాషలో మీడియాలకు ‘బీప్’ సౌండింగ్ వినిపించే సౌకర్యాన్ని కూడా కల్పించారు.

ఎంతలా వీరి దాడులు చెలరేగాయంటే… ప్రశ్నించే వ్యక్తి అయ్యప్ప మాలధారణలో ఉన్నాడన్న విజ్ఞతను కూడా మరిచిపోయి, తమ అసభ్య పదజాలంతో చెలరేగిపోయారు. ఒకానొక సమయంలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించమంటారా? లేదా? అని సదరు మీడియా ప్రతినిధే చేతులెత్తి దండం పెట్టేసారు. ఓ పక్కన సదరు ఎమ్మెల్యే వారిస్తున్నా, అతని వ్యాఖ్యలు కూడా లెక్క చేయకుండా ప్రవర్తించడం… మొత్తం జగన్ పార్టీకే చెడ్డ పేరును తీసుకువస్తోంది.