ఏ పార్టీ అధికారంలో వుంటే… గంటా శ్రీనివాస రావు ఆ పార్టీలో వుంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వున్న ఆయన, అధికా రంలో వున్న వైసీపీలో చేరడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఈ నెల 16న అందుకు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారట. గంటా చేరిక ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లను ఇబ్బంది పెడుతుంది.
అవంతి ఇప్పటికే బాహటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అతని అనుచరులతో తన నియోజకవర్గంలో నిరసనలు తెలిపించారు. తాజాగా ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనం ప్రకారం… ఒకవేళ గంటాని పార్టీలోకి తీసుకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని అవంతి బెదిరింపుకు దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన గంటా.. ఆతర్వాత ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో… మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి మరోసారి మంత్రి కూడా అయ్యారు.
అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. కొంతకాలంగా ఆ పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో అప్పటి నుంచే ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతూ వస్తోంది. గంటా తో పాటు మరింత మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా రెడీ అని వార్తలు వస్తున్నాయి.