కృష్ణా జిల్లా గన్నవరం… టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ని వైఎస్సార్ కాంగ్రెస్ చేరదీసి తప్పు చేసినట్టుగా కనిపిస్తుంది. ఆయన చేరిక పార్టీలో రగిల్చిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. వారానికి ఒక్క సారైనా ఆ పార్టీలోని గ్రూపులు బహిరంగంగా బాహాబాహీకి దిగి అధికార పార్టీ పరువుని రచ్చకీడుస్తున్నాయి.
అయినా పార్టీ అధిష్టానం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ఈరోజు ఉదయం కేసరపల్లిలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యక్రమంలో పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని వార్తలలోకెక్కారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
పార్టీలోని దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావ్ వర్గాలు వంశీ చేరికను జీర్ణించుకోలేకపోతున్నాయి. తమ మధ్య ఏళ్ళ తరబడి వైరం ఉందని వంశీ పార్టీ మారడంతో అన్నీ మర్చిపోయి కలిసి పని చెయ్యలేం అని ఓపెన్ గానే చెబుతున్నారు. అయితే ఈ కుమ్ములాటల వల్ల పార్టీ ప్రజలలో పల్చన అవుతుంది.
పైకి చెప్పకపోయినా పార్టీ మారి తప్పు చేశానని వల్లభనేని వంశీ లోలోపల బాధపడుతున్నారని ఆయన వర్గం వారే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న ప్రతి చోటా వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉండటం గమనార్హం. దానిని పార్టీ అధిష్టానం అసలు పట్టించుకోకపోవడం కొసమెరుపు.