గత అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా సీనియర్ రాజకీయ నాయకుడైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేష్ వైసీపీలో చేరారు. తొలుత పర్చూరు నుంచి హితేష్ పోటీలోకి దించాలని ప్రయత్నించినా పౌరసత్వ వివాదం వల్ల డాక్టర్ దగ్గుబాటి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పర్చూరుపై వైసీపీ అధిష్టానం దృష్టిపెట్టింది. నియోజకవర్గంలో దగ్గుబాటి ఏకపక్షముగా వ్యవహరిస్తున్నారని, శ్రేణులను, ఇతర నాయకులను కలుపుకుని పోవడం లేదని అధిష్టానానికి కంప్లయింట్స్ వెళ్తున్నాయట.
ఈ నేపథ్యంలో డాక్టర్ దగ్గుబాటి పోకడపై పార్టీ అధిష్టానం దృష్టి సారించడంతో పాటు సీఎం జగన్ కూడా ఆరా తీయటం, ఇంటెల్సిజెన్స్ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆ నియోజకవర్గ సమాచారాన్ని పసిగడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోనే ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న పార్టీ సమావేశాల్లోను మీడియా సమావేశాల్లోను పురందేశ్వరి కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలను దుయ్య బట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యానాలు వైసీపీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ క్రమంలో జగన్, దగ్గుబాటి మధ్య అంతరం పెరుగుతుందని సమాచారం. పార్టీలో చేరకముందే పురంధేశ్వరి రాజకీయ ప్రస్థాన్ని తాను ప్రభావితం చెయ్యబోనని చెప్పినా ఇప్పుడు ఆ విషయాన్ని తెరమీదకు తేవడం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు నచ్చడం లేదంట. నియోజకవర్గ ఇంఛార్జ్ మీదే నిఘా పెడితే పార్టీ అంతా ఒకతాటి మీదకు ఎలా వస్తుందని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఇదంతా ఎందుకు బీజేపీలోకి వెళ్తే ఏ గొడవా ఉండదు కదా అని కూడా కొందరు సలహాలు ఇస్తున్నారట.