అమరావతి విషయంలో ఏం జరగబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నిన్న కాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుల ను ఆమోదించుకోవడానికి మరో సారి ప్రయత్నించి భంగపడింది. ఇంతలోనే ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కరోనా పరిస్థితులు చక్కబడే వరకు రాజధాని తరలింపు ఉండదు అని చెప్పారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో ప్రయత్నించి అక్కడ ఉన్న నిర్మాణాల ప్రోగ్రెస్ ని పరిశీలించారు. గతంలో ఆయనే అమరావతిని శ్మశానం అన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్ లో పెట్టిన రైతుల కౌలు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. ఉన్నఫళంగా ప్రభుత్వంలో వచ్చిన ఈ మార్పుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఉన్న ఫలంగా రాజధాని రైతుల పై ప్రేమ పుట్టుకొచ్చిందా? లేక కోర్టుల నుండి ఎదురుదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తలా? అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
ఈ మార్పునకు కారణమేదైనా… దాదాపుగా 200 రోజుల నుండి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు తాత్కాలికంగానైనా ఇది ఉపశమనం కలిగించేదే. మరోవైపు… రాజధాని తరలింపు విషయం ఇప్పటికే కోర్టులలో ఉన్న సంగతి తెలిసిందే.