ఏదో సామెత అన్నట్లు… ఓటుకు నోటు కేసును వెలుగులోకి తెచ్చిన టీఆర్ఎస్ సర్కార్ సైలెంట్ గా ఉంటే, జగన్ మీడియా మాత్రం ఓ రేంజ్ లో హడావుడి చేస్తున్న వైనం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ కాక తప్పదు అంటూ తన మీడియా ద్వారా జగన్ ప్రచారం చేస్తుంటే… అసలు ఈ కేసు నిలబడదని టిడిపి వర్గాలు అంటున్నాయి. మరి ఇంతకీ అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం ఎలా ఉంది? దానికి సమాధానమే తాజా స్పందన.
“ఈ కేసులో ఏమీ లేదని… ఈ కేసును ఆధారంగా చేసుకుని వైసీపీ తమను ఏమీ చేయలేదని” కీలక వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు. ‘ఓటుకు నోటు కేసు ప్రాతిపదికే అసలు చెల్లదని హైకోర్టు చెప్పినా… వైసీపీ నేతలు ఏసీబీ కోర్టుకు వెళ్లడంలో అర్థం లేదు. ఇందులో వైసీపీ ఊరికే అల్లరి చేస్తోంది. ఈ కేసులో ఏమీ లేదు. వాళ్ల వల్ల ఏమీ కాదు. పైగా ఇలాంటి కేసుల వల్ల వాళ్లకే చెడ్డపేరు వస్తుంది. మనం పనులు చేస్తుంటాం. వాళ్లు కేసులు వేస్తుంటారు, ఈ కేసును లైట్ తీసుకోమన్నట్లుగా’ స్పష్టంగా వెల్లడించారు.
‘మనం రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. వాళ్లు మనల్ని వెనక్కు ఎలా లాగాలా అని నిరంతరం ప్రయత్నిస్తున్నారు. వరుస కేసులతో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యం. అయినా వాళ్ల వల్ల ఏమీ కాదు’ అంటూ జగన్ మీడియా చేస్తున్న హడావుడిపై టిడిపి వర్గాలకు దిశానిర్దేశం చేసారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.