టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. కొత్త ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకు తాళలేక ఆయన కన్నుమూశారని టీడీపీ ఆరోపణ. అందులో నిజం లేకపోలేదు అని రాష్ట్రమంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఆ మకిలి తిరిగి టీడీపీకే అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. కష్ట కాలంలో టీడీపీ, చంద్రబాబు నాయుడు కోడెలకు బాసటగా నిలవలేదని ఆ మనస్తాపం ఆయన్ని బలవన్మరణానికి ప్రేరేపించిందని వారి ఆరోపణ.
కోడెల ఇప్పుడు మరణించారు కాబట్టి చంద్రబాబు ఆయనకు మద్దతు ఇవ్వలేదని అంటున్నారు. ఒకవేళ ఆయన బ్రతికి ఉండి చంద్రబాబు ఆయనకు బాసటగా నిలిస్తే వీరు ఏమనే వారు? కోడెల మీద కేసులు పెట్టిన వారే చంద్రబాబు ఆయనకు బాసటగా నిలవలేదు అనే నైతిక హక్కు ఉందా? ప్రభుత్వం పెట్టిన కేసుల ఒత్తిడి వల్ల కోడెల చనిపోయారు అనేది నిజం. ఆయన చనిపోయిన తరువాత కూడా కొడుకు కోడెల గొడవ పడ్డారని, కోడెల కొడుకు తండ్రి మీద చెయ్యి చేసుకున్నాడని ప్రచారం చేసింది సాక్షి.
అందువల్లే ఆత్మహత్య చేసుకున్నారు అని వదంతులు వ్యాపింపచేసింది. దానిని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే జరిగిన నిజం ఏమిటంటే అసలు కోడెల కొడుకు అది జరిగినప్పుడు దేశంలోనే లేడు. ఒకవేళ ఆయన ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ లో చేసుకుని ఉంటే ప్రభుత్వం కుటుంబసభ్యులకు చుక్కలు చూపించేది అన్నది కూడా నిజమే కదా. ఇప్పుడు ఆయన మీద కేవలం చంద్రబాబు మీద అక్కసుతో మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్ముతారు అని టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.