YSR Congress Party lost in MLC Electionsస్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలు వైసీపీకి శరాఘాతంగా మారాయి. రాయలసీమలో ఎన్నికలు జరిగిన మూడు జిల్లాల్లోనూ అధికార తెలుగుదేశం అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులైన వైకాపా క్యాండిడేట్లపై విజయం సాధించడంతో వైకాపా నేతల్లో అంతర్మథనం మొదలైంది. సీమలోని స్థానిక సంస్థల ఓట్లలో అత్యధికులు వైకాపా నుంచి పోటీ చేసి గెలిచిన వారే. పరిస్థితులు అన్నీ బాగుంటే, వాస్తవానికి ఈ మూడు స్థానాలూ వైకాపా ఖాతాలో చేరాల్సినవే.

కానీ, వైకాపా టికెట్ పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం, వారి వెనుకే ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వందల సంఖ్యలో టీడీపీలో చేరడంతో వైకాపా ఓట్లన్నీ తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయినప్పటికీ ఓటర్ల మనసులో తమపై ఉన్న అభిమానం క్రాస్ ఓటింగ్ కు కారణమవుతుందని వైకాపా భావించింది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తున్నప్పటికీ, అది వైకాపా విజయానికి మాత్రం దారితీయలేదు.

ఏ అభ్యర్థి ఎవరికి ఓటు వేస్తారన్న విషయం తెలిసేలా బార్ కోడ్ లను ఏర్పాటు చేయడంతోనే పలువురు క్రాస్ ఓటింగ్ కు భయపడ్డారని వైకాపా భావిస్తోంది. ఇక ఓట్లున్నా సీట్లు గెలుచుకోలేకపోయామని, బెదిరింపు, అక్రమ కేసులతో ఓటర్లను భయపెట్టి తెలుగుదేశం గెలిచిందని వైసీపీ అధినేత జగన్ మరియు ఇతర నేతలు ఆరోపణలు గుప్పించడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పక్కన ఈ విజయాలతో అధికార టిడిపిలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.