పేదవాడికి వినోదం అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ సినిమా టికెట్స్ రేట్లను తగ్గించి పేదలకు అందుబాటులో ఉంచితే, ప్రతిపక్షాలు దానిని కూడా రాజకీయం చేయడం అత్యంత బాధాకరం అంటూ మీడియా ముందుకు వచ్చిన మంత్రులు., వైసీపీ నాయకులు మండిపడిన విషయం తెలిసిందే.
అయితే అదే మంత్రులు, నేతలు రాష్ట్రంలో ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు బదులివ్వాలంటూ ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కాయి. కరెంట్ చార్జీలు పెంచినప్పుడు గుర్తు రాని పేదవాడు సినిమా చూసేటప్పుడు మాత్రమే మీకు గుర్తుకు వచ్చాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజానీకం. అధికారం వచ్చిన తర్వాత ‘పెంచుకుంటూ పోతాను’ అని చెప్పిన మాటలకు అర్ధాలు ఇవేనా ముఖ్యమంత్రి గారు? అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఉప్పు – పప్పు., చింతపండు – బెల్లం., ఎండుమిర్చి., వంటనూనెలు., పెట్రోల్ – డీజిల్ ఇలా ప్రజామనుగడకు అవసరమైన వస్తువుల రేట్లు పెంచుకుంటూ పోయి., పేదవాడి కనీస ఆలోచనలో కూడా లేని వినోదాన్ని అందుబాటులో ఉంచితే అది సంక్షేమ పాలన అవుతుందా? దీనికి సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక పన్నులతో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో జగన్ పేదవాడికి అసలైన సినిమా చూపిస్తున్నాడని., అయితే ఈ సినిమా వినోదానికి కాక విధ్వంసానికి కారణమవుతుంది. ఏదేమైనా సినిమానే కాబట్టి, ఈ సినిమా ధరలను కూడా జగన్ నియంత్రించాలని పేద ప్రజల కోరిక.
పేదవాడి పేరుతో – పరాచకాలు; వినోదం పేరుతో – విధ్వంసాలు; సంక్షేమం పేరుతో – సంక్షోభాలు; వికేంద్రీకరణ పేరుతో – వికృత క్రీడలు ఆడుతూ., జగన్ తనను నమ్మి ఓటేసిన ప్రజలకు అందిస్తున్న “రత్నాలు” ఇవే అంటూ ప్రతిపక్ష నేతలు తమ నిరసనను తెలుపుతున్నారు. జగన్ పూటకో మాట తప్పుతాడు., రోజుకొక మడం తిప్పుతాడని., మీడియా ముందుకు వచ్చి మీరు., మీ నాయకులు చెప్పే అబద్ధాలతోనే ప్రజలకు అసలైన వినోదాన్ని అందుతోందని టీడీపీ నేతలు ఛలోక్తులు విసురుతున్నారు.