వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెలలో అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చెయ్యడంతో అమరావతి రైతులు రోడెక్కారు. ఆ రోజు నుండి ఈరోజు వరకూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం దీనిపై సంపూర్ణంగా మౌనం వహిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన రైతులకు భరోసా కలిగిస్తూ ఒక్క వ్యాఖ్య కూడా చెయ్యకపోవడం గమనార్హం.
దీనికి తోడు మంత్రులు తలా ఒక మాట అంటూ వారిని క్షోభకు గురిచేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులని, రియల్ ఎస్టేట్ ఏజెంట్లని రకరకాలుగా వేధిస్తున్నారు. అది అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకు అవసరం అనేదాని మీద కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తలో మాట మాట్లాడటం గమనార్హం.
ఒక మంత్రిగారు… హైదరాబాద్ అంత నగరం కావాలంటే.. వైజాగ్ మాత్రమే తొందరగా అవుతుంది. అందుకే వైజాగ్ ని రాజధాని చేస్తాం అంటారు. ఇంకో మంత్రి గారు… మరో హైదరాబాద్లా కాకూడదు అని 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం అని అంటారు. ఇద్దరి మాటలు పరస్పర విరుద్ధంగా ఉండటం గమనార్హం.
అసలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ లాంటి నగరం నిర్మించే ఆలోచన ఉందా లేదా అనేది అసలు ప్రశ్న. అసలు ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ లాంటి నగరం అవసరం అని ఈ ప్రభుత్వం అనుకుంటుండగా అనేది మరో ప్రశ్న. బహుశా ఈ నెలాఖరున అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏమైనా స్పష్టత ఇస్తారేమో చూడాలి.