ఆంధ్రప్రదేశ్ విషయంలో సర్వేలలో మరోసారి సందిగ్దత కనిపించింది. గత ఎన్నికలు లాగానే టీడీపీ అని కొందరు, వైఎస్సార్ కాంగ్రెస్ అని కొందరు చెప్పుకొచ్చారు. ఎక్కువగా సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపడం విశేషం. లగడపాటి, టుడేస్ చాణక్య వంటి ట్రాక్ రికార్డు కలిగిన సంస్థలు టీడీపీ వైపు నిలిచాయి. మెజారిటీ సర్వే సంస్థలు వైకాపా వైపే ఉన్నా ఆ పార్టీలో కలవరం మాత్రం పోవడం లేదు. టీడీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వేలను ప్రెస్ మీట్ పెట్టి మరి తిడుతున్నారు.
లగడపాటిని అయితే ఏకంగా ఆగర్భశత్రువుగా చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.మొన్న ఆ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న సినీ రచయిత చిన్ని కృష్ణ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి లగడపాటి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టాడని, అతని సోదరుడికి సినిమాలు తీయ్యడం రాదని ఏదేదో మాట్లాడేశారు. దానికి సర్వేలు చెయ్యడానికి సంబంధం ఏంటో మరి. చేతిలో సినిమాలు లేని చిన్ని కృష్ణ రాజకీయాలు మాట్లాడొచ్చుగానీ లగడపాటి మాట్లాడకూడదా అనే అనుమానం రాకమానదు.
ఎవరు ఎంత ఆవేశపడిన ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యి ఉంది. దానిని ఎవరూ మార్చలేరు. సర్వేలు ఏమని చెప్పినా అంతిమంగా ప్రజాతీర్పే ఫైనల్. లగడపాటి అయినా ఇంకొకరు అయినా చేసేది ఏమి ఉండదు. ఈలోగా ఆవేశపడటం ఆయాస పడటం ఎందుకో? ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు గనుక వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోతే ప్రజలు ఓడించినట్టా లేక లగడపాటి ఓడించినట్టా? ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినందుకు కూడా వారికి కోపం రావొచ్చు.