గత నాలుగైదు రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన అభిప్రాయం నెలకొన్నట్లుగా కనపడుతోంది. ఈ వారం రోజులలో పవన్ అధికార పక్షంతో సహా దాదాపుగా అన్ని పార్టీల పైన స్పష్టమైన విమర్శలు, సెటైర్లు చేసిన వైనం తెలిసిందే.
ఇదే స్థాయిలో పవన్ ఎదురు కౌంటర్స్ కూడా వచ్చాయి. అధికార పక్షం టిడిపి నేతల నుండి, బిజెపి వరకు చురకలు అంటిస్తూ కౌంటర్స్ వేసారు. కానీ ఎక్కువ విమర్శలు చేసిన వైసీపీ నేతల నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం గమనించదగ్గ అంశం.
మిగిలిన అన్ని పార్టీల కన్నా పవన్ ఎక్కువ విమర్శలు చేసింది వైసీపీ పైనే. ప్రతిపక్ష పార్టీగా విఫలం అవుతోందని, వారసత్వంగా సిఎం కావాలని కోరుకోవడం తప్పని, ఇలా ప్రత్యక్షంగానే మాట్లాడారు. దీంతో వీటిపై వైసీపీ నుండి భారీ స్థాయిలో స్పందని వస్తుందని రాజకీయ వర్గాలు భావించారు.
కానీ ఒక్క రోజా మినహాయించి పెద్దగా ఎవరూ స్పందించలేదు. మరి ఎందుకు ఎవరూ పవన్ పై విరుచుకుపడలేదు? అంటే… పవన్ పై ఎలా స్పందించాలో తెలియని అయోమయ స్థితిలో ‘జగన్ అండ్ కో’ ఉందనేది పొలిటికల్ టాక్.
తదుపరి ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావాలంటే ‘జనసేన’ కీలకం అవుతుంది గనుక, భారీ స్థాయిలో విమర్శలు చేయడం తగదనే అభిప్రాయం వైసీపీలో నెలకొన్నట్లుగా కనపడుతోంది. గతంలో పీకే కూడా ఇదే సూచన చేయడంతో, పవన్ పై ఎదురుదాడి చేయడం కన్నా, సంయమనం పాటించడమే ఉత్తమం అనుకున్నారేమో..!