చంద్రబాబు హయాంలో ఏపీ ఈడిబి కార్యనిర్వహాణాధికారిగా పనిచేసిన కృష్ణ కిశోర్ విషయంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) పాలన ఇలా కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పదిరోజుల క్రితం ఆయన్ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కిషోర్పై సీఐడీ కేసు కూడా నమోదుచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను అభివృద్ధికి వినియోగించాలి. కృష్ణ కిషోర్కి పెండింగ్లో ఉన్న జీతం వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్ఎస్ అధికారి విషయంలో ఏపీ ప్రభుత్వం హద్దులు దాటిందని క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికింది.
దీనికి ప్రభుత్వం తరపున లాయర్ సమాధానం విస్తుగొలిపేలా ఉంది. “ఆ విషయం వారు కూడా గుర్తుంచుకోవాలి. వారు అధికారంలో ఉన్నప్పుడు మమల్ని ఎలా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు,” అంటూ చెప్పడంతో కృష్ణ కిషోర్ లాయర్ ప్రభుత్వ కక్షసాధింపుకు ఇదే నిదర్శనం అని చెప్పడంతో న్యాయమూర్తి “ఈ వైఖరి మీరు ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిదని.” హితవు పలికారు.
ప్రభుత్వం తన వైఖరిని న్యాయమూర్తి ముందు తానే బయటపెట్టుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు మాత్రం దీనికి కూడా చంద్రబాబునే నిందిస్తున్నారు. న్యాయ వ్యవస్థను మ్యానేజ్ చెయ్యడం చంద్రబాబుకు కొత్తేమి కాదని, తమ విషయంలో అయితే ఇటువంటి పరుష వ్యాఖ్యలు, చంద్రబాబు కేసుల విషయంలో మాత్రం మెతక వైఖరి అవలంభిస్తారు అంటూ ఆరోపణలు చెయ్యడం గమనార్హం.