2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య కేసుపై ఏపీ హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించిన కోర్టు… విచారణ సందర్భంగా సిబిఐకి స్థానిక పోలీసులు సరిగ్గా సహకరించడం లేదు అనే దాని మీద సీరియస్ అయ్యింది.
ఆ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ఇవ్వాలంటూ పులివెందుల మేజిస్ట్రేట్ ను సీబీఐ కోరింది. స్థానిక పోలీసులు కూడా విచారణలో సహకరించడం లేదు. పై అథారిటీ అనుమతి లేకుండా రికార్డులు ఇవ్వటం కుదరదని సీబీఐకి చెప్పడంతో రికార్డులు అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించగా… అన్ని రికార్డులను అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీనితో కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ… విచారణ సందర్భంగా సీబీఐ పలువురిని ప్రశ్నించటంతో పాటు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. అయితే వివేకా కుమార్తె ఇచ్చిన అనుమానితుల లిస్టు జోలికి ఇంకా వెళ్ళలేదు. ఆమె ఇచ్చిన పద్నాలుగు మంది అనుమానితుల జాబితాలో ఇద్దరు తప్ప మిగతా అందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు లేదా వైఎస్ కుటుంబానికి దగ్గర వారే.
ఎన్నికలకు ముందు జగన్ ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసే వారు. అయితే అధికారంలోకి వచ్చాక సిబిఐ అక్కరలేదని కోర్టులో వాదించారు. దీనితో ఈ హత్య ఇంటి దొంగల పనే అని వారిని ముఖ్యమంత్రి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.