YS-Sharmila-YS-Vijayamma-YS-Vivekananda-Reddyవైఎస్ వివేకానందరెడ్డి హత్య చేయబడి ఒకసారే చనిపోయారు. కానీ నేటికీ ఆయన రోజుకో రకంగా హత్య చేయబడుతున్నారు. అంతకాదు… బ్రతికి ఉన్నంతకాలం ఎంతో గౌరవంగా బ్రతికిన ఆయన, చనిపోయాక తీరని అప్రదిష్టకు గురవుతున్నారు.

ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మిగిలిన నిందితులే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా వైఎస్ వివేకానంద రెడ్డి స్త్రీలోలుడని, ల్యాండ్ సెటిల్‌మెంట్స్ చేసేవారంటూ రోజుకో కొత్త ఆరోపణ చేస్తూ ఆయన పరువును, దాంతో పాటే వైఎస్ కుటుంబం పరువును కూడా బజారుకీడుస్తున్నారు. ఆయన కుమార్తె సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డే వివేకాను హత్య చేయించారని ఆరోపిస్తూ బాధితులనే హంతకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంత జరుగుతున్నా వైఎస్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న విజయమ్మ కానీ, బాబాయ్ వివేకానంద రెడ్డి చాలా మంచి మనిషని చెప్పిన వైఎస్ షర్మిలగానీ కలుగజేసుకొని వారించే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

‘న్యాయస్థానంలో ఎన్నయినా వాదనలు వినిపించుకోండి కానీ మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతూ మా కుటుంబం పరువు తీయవద్దని’ విజయమ్మ గట్టిగా హెచ్చరించినా, కనీసం ఈ ఆరోపణలను ఖండించినా బహుశః అందరూ వెనక్కు తగ్గేవారు. కానీ ఆమె ఎందుకో మౌనంగా ఉండిపోతున్నారు.

గత నెలలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళుతున్నప్పుడు దారిలో విజయమ్మ ఇంటికి వెళ్ళి ఆమె ఆశీర్వచనం తీసుకొన్నానని చెప్పారు. తన మరిది (వివేకానంద రెడ్డి)ని హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఆమె ఆశీర్వదించడం నిజమే అయితే అది మరింత ఆశ్చర్యకరమైన విషయమే అవుతుంది.

ఈ కేసు విషయంలో కలుగజేసుకోవద్దని అవినాష్ రెడ్డి కోరినందునే ఆయన తమ కుటుంబం పరువు బజారుకీడుస్తున్నా ఆమె మౌనం వహిస్తున్నారా? లేక తాను అవినాష్ రెడ్డిని సమర్ధించినా, వ్యతిరేకించినా ఆ ప్రభావం కొడుకు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై పడుతుందని మౌనం వహిస్తున్నారా? తెలీదు కానీ ఆమె మౌనంగా ఉండిపోతున్నారు.

ఇక ఏ విషయంపైనైనా ధైర్యంగా మాట్లాడే వైఎస్ షర్మిల కూడా వివేకా హత్య కేసులో నిందితులు, వైఎస్ కాంగ్రెస్‌ నేతలు సైతం చనిపోయిన బాబాయ్ వివేకాపై, తాను ఎంతగానో అభిమానించే ఆయన కుమార్తె సునీతారెడ్డిపై బురద జల్లుతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయారో తెలీదు.

వీరిద్దరూ ఇంకా ఎప్పుడు స్పందిస్తారో అసలు స్పందిస్తారో లేదో కూడా తెలీదు. కానీ మౌనంగా ఉంటూ వారిరువురూ, ఆరోపణలు చేస్తూ నిందితులు, వైసీపీ నేతలు అందరూ కలిసి వైఎస్ కుటుంబం పరువు మంటగలిపేసుకొంటున్నారని చెప్పక తప్పదు. వివేకా హత్య ఎంత దారుణమైనదో… ఈ పరిణామాలన్నీ కూడా అంతే దారుణంగా ఉన్నాయి.