వైఎస్ షర్మిల రాజకీయాలలోకి వస్తున్నా అని ప్రకటించిన వెంటనే స్పందించిన నాయకులలో మొదటి వ్యక్తి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాజకీయాలలో ఆమెకు సీన్ లేదని ఎద్దేవా చేశారు ఆయన. అయితే అప్పుడు దాని మీద షర్మిల స్పందించలేదు. అయితే తాజాగా అరవింద్ మీద పరోక్ష వ్యాఖ్యలు చేసారమే.
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో మాట్లాడుతూ ధర్మపురి అరవింద్ పేరు పెట్టకుండానే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపరో ఇచ్చారంట… బాండ్ పేపర్ ఇచ్చి రైతులను దగా చేశారట’’ అంటూ అరవింద్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా? పసుపు రైతుల కష్టాలు వర్ణనాతీతం, ఎక్స్ టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా? ప్రతి గడపకు పూసే పసుపు పండించే రైతు కష్టాలు కనపడటం లేదా? బైంసాలో మతకల్లోలాలు సృష్టించడంపై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఉండటం లేదా?’’ అని ప్రశ్నించారు.
షర్మిల బీజేపీ ఏజెంట్ అంటూ కొందరు విమర్శలు చేస్తున్న తరుణంలో వ్యూహాత్మకంగానే ఆమె అరవింద్ ని టార్గెట్ చేసినట్టుగా ఉంది. పైగా బైంసాలో మతకల్లోలాలు సృష్టించడంపై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఉండటం లేదా? అంటూ మొత్తంగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా బీజేపీ ఆమె ను టార్గెట్ చేస్తే… షర్మిల కు కావాల్సిన రాజకీయ మైలేజ్, పబ్లిసిటీ వస్తుంది. ఏది ఏమైనా షర్మిల తెలివిగానే పావులు కదుపుతున్నారు.