జులై 8 వైఎస్ జయంతి తెలంగాణలో తన రాజకీయ పార్టీని అత్యంత అట్టహాసంగా ప్రకటించాలని… ఆ సభతో తన పవర్ ఏంటో చూపించాలని షర్మిల ఎప్పటి నుండో ప్లాన్ చేస్తూ వచ్చారు. అయితే కరోనా కారణంగా అది జరిగేలా లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయి సభ కుదరదని నాయకులు ఆమెకు చెప్పారట.
ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేసినా పోలీసులు అనుమతి ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారట. దానితో ఆన్ లైన్ లోనే ఆ రోజు పార్టీ పేరుని ప్రకటించి ఊరుకోవాలని సలహా ఇచ్చారట. లేదా అతి కొద్ది మందితో ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుని పార్టీ పేరుని ప్రకటించుకోవాలని మరో సలహా అని సమాచారం.
సహజంగా భారీ బహిరంగసభలకు మీడియా కవరేజ్ ఆటోమేటిక్ గా వస్తుంది. అయితే ఆన్ లైన్ లాంచ్ లేదా చిన్న కార్యక్రమం అయితే మీడియా ఛానెల్స్ ను బ్రతిమాలుకోవాలి లేదా స్లాట్స్ కొనుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంతకంటే వేరే దారి కనిపించడం లేదు. దీనితో షర్మిల ఆశలు అడియాశలు అయ్యాయి.
ఇకపోతే తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం తన తండ్రి, అన్న లానే పాదయాత్ర నే నమ్ముకున్నారు షర్మిల. కరోనా పరిస్థితి చక్కబడగానే జిల్లాలలో పాదయాత్రకు వెళ్లి డైరెక్ట్ గా ఓటర్లను కలుసుకోవాలని… 2023లో జరిగే ఎన్నికల సమయం వరకు పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలని షర్మిల భావిస్తున్నారట.