YS Sharmila - ABN RK- Vemuri Radha Krishnaదివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల హైదరాబాద్ లో వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం పెట్టి తెలంగాణ లో పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ వార్త కొన్ని వారాల క్రితమే ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థ అని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు దానిని సీరియస్ గా తీసుకోలేదు.

అటు టీడీపీ అభిమానులు కూడా దానిని నమ్మలేదు. అయితే ఏబీఎన్ – ఆర్కే మాత్రం తన మాట మీదే గట్టిగా నిలబడ్డారు. సాక్షి అయితే షర్మిల పేరుతో ఒక ఖండన లేఖ ఇప్పించింది. ఇప్పుడు ఆర్కే చెప్పిందే నిజంకావడం తో అప్పుడు ఆర్కేని విమర్శించిన వారంతా ఇప్పుడు ముక్కు మీదే వేలేసుకున్నారు.

అయితే ఇంతటి కీలక వార్త గురించి ఆర్కే కు ఎలా తెలిసింది అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల భర్త … బ్రదర్ అనిల్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని ఆర్కే కు లీక్ ఇచ్చారట. ఉద్దేశపూర్వకంగా లీక్ ఇచ్చారని అంటున్నారు. అంతా బలమైన సోర్స్ నుండి ఉప్పందడంతో ఆర్కే కూడా ఆ విషయంగా అంత బలంగా నిలబడ్డారు.

మరోవైపు… షర్మిల తన పార్టీకి ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ అనే పేరు అనుకుంటున్నారట. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసే పనిలో ఉన్నారట. ఒకవేళ ఆ ప్రక్రియ పూర్తయ్యాకా మార్చిలో అధికారిక ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. పార్టీ ప్రకటన చేశాకా షర్మిల పాదయాత్ర చేపడతారని కూడా వార్తలు వస్తున్నాయి.