ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనే భావన ప్రజలలోకి బలంగా తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ వారు. ఆ పార్టీకి అనుకూలంగా ఉండే కొందరు జర్నలిస్టులు అదే పనిగా కాంగ్రెస్ కూడా జగన్ మద్దతు కోసం చూస్తుంది అనే అభిప్రాయం కలిగించేలా లీకులు ఇస్తున్నారు. తాజాగా ఒక జర్నలిస్టు జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి ఆరు షరతులు పెట్టారని చెప్పుకొచ్చారు. వీటికి ఒకే అంటేనే ఫలితాల తరువాత మాట్లాడుకుందాం అన్నారట.
మొదటి షరతు… మద్దతు కు సంబందించిన ఏ మాటలైనా ఫలితాల తరువాతే జరగాలి. రెండు… ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని రాతపూర్వక హామీ ఇవ్వాలి… మూడు … మైనారిటీల కోసం తాము బీజేపీతో కలవకపోయినా దానిని తమ బలహీనతగా తీసుకోకూడదు… నాలుగో షరతు… ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో జగన్ ను విమర్శించే నాయకులను తప్పించాలి. ఇవన్నిటి కంటే చివరి రెండు షరతులు ఇంకా కఠినమైనవని తెలుస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడును పూర్తిగా దూరం పెట్టాలి.
బీజేపీయేతర పక్షాల మద్దతు యూపీఏ కోసం కూడగట్టడానికి చంద్రబాబు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను జగన్ కోసం పక్కకు తప్పిస్తారా అనేది చూడాలి. ఆరో షరతు ఇంకా కఠినమైనది. వైఎస్సార్ కాంగ్రెస్ సపోర్టు కావాలంటే సోనియా గాంధీ స్వయంగా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ఫోన్ చేసి అభ్యర్ధించాలి. గతంలో ఓదార్పు యాత్ర పర్మిషన్ కోసం విజయమ్మ జగన్ సోనియా దగ్గరకు వెళ్ళినప్పుడు తమను అవమానించారని, దానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని జగన్ కండిషన్ పెట్టారట. మరి వీటి అన్నిటికీ కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటుందో లేదో చూడాలి.