ప్రత్యేక హోదా పై వైఎస్ఆర్ కాంగ్రెస్ తన 10వ యువభేరి అనంతపూర్లో నిర్వహించింది. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదు. అందుకే మన హక్కును సాధించుకోవడానికి నిరంతరాయంగా, ఐక్యంగా పోరాడుదాం అని జగన్ పిలుపునిచ్చారు. ఐతే మొత్తం జగన్ ప్రసంగం చూసిన వాళ్ళందరు అయోమయంలో పడకుండా ఉండలేరు.
ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు ఆంధ్రకు ఎందుకు రాలేదు అంటే బీజేపీ మోసం చెయ్యడం వల్ల అని ఎవరైన చెప్తారు. ఐతే మన జగన్ గారు మాత్రం చంద్రబాబు అడగకపోవడం వల్లే మోడి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఆయన అడిగితే తప్పకుండా ఇచ్చేవాళ్ళని చెప్పే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడ దాకా బానే ఉంది ఐతే ఇవ్వాల్సింది ఎవరు?అడగాల్సింది ఎవరిని?
ఒకపక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంటూనే ఇంకోపక్క రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్డులకు భేషరత్తుగా మధ్ధతు ఇవ్వడం ఒక జగన్కె చెల్లింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్ 100 పేర్లతో సభలు పెట్టుకోవచ్చు ఐతే ప్రత్యేక హోదా సభ అంటూ బీజేపీని వదిలేసి చంద్రబాబును తప్పు పడితే నష్టం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కలిసివచ్చేది ఏమీ లేదు అనేది జగన్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.