ఎన్టీఆర్ సమయంలో రాజకీయ పునరావాస కేంద్రమని శాసనమండలిని రద్దు చేశారు. ఆ తరువాత 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాకా ఆశావహుల కోసమని మండలిని పునరుద్ధరించారు. ఇప్పుడు అదే మండలి వైఎస్ కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చికాకు పెడుతుంది.
ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించినా, మండలిలో మాత్రం ఇంకా టీడీపీనే మెజారిటీ లో ఉంది. నిన్న ఒక్క రోజే మండలిలో రెండు బిల్లులను టీడీపీ విజయవంతంగా ఆపగలిగింది. ప్రభుత్వం తెచ్చిన ఇంగ్లీష్ మీడియం బిల్లుకు తెలుగు , ఇంగ్లీష్ రెండూ ఉండాలి అనే సవరణ తీసుకొచ్చింది టీడీపీ.
అలాగే ఎస్సీ కమిషన్ బిల్లు తీసుకొస్తే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి అంటూ మరో సవరణ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రెండు బిల్లులు మళ్ళీ శాసనసభకు వెళ్ళాలి. అంటే బడ్జెట్ సమావేశాల వరకూ ఆగాలి. ప్రభుత్వం ఈ బిల్లులను రద్దు చేసి ఆర్డినెన్సు జారీ చెయ్యవచ్చు. అయితే అది ప్రభుత్వానికి అప్రదిష్ట. దీనితో మండలిని పూర్తిగా రద్దు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు జగన్.
ఈ బిల్లుల సందర్భంగా కొందరు మంత్రులు డైరెక్టుగానే మండలిని రద్దు చేస్తామని బెదిరించారట. అయితే టీడీపీ మాత్రం ఒప్పుకోలేదు. 2021 వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ మండలిలో ఆధిక్యంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో వైఎస్ తెచ్చిన దానిని జగన్ తీసేస్తారా? అని అందరూ చర్చించుకుంటారు.