అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. అయితే మున్ముందు సతీసమేతంగా కోర్టుకు హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసుల తొలిసారిగా సతీమణి భారతి పేరు చార్జిషీటులోకి ఎక్కింది.
భారతి సిమెంట్స్ విషయంలో జరిగిన క్విడ్ ప్రో కోలో జగన్తో పాటు భారతిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ చార్జిషీటు దాఖలు చేశారు.
ఒకవేళ ఈడీ ఈ చార్జిషీటును కోర్టు విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. 11 చార్జిషీట్లపై విచారణలో భాగంగా జగన్ ఇప్పటికే హాజరవుతుండగా, ఇప్పుడు భారతిపై దాఖలు చేసిన చార్జిషీటును కూడా కోర్టు స్వీకరిస్తే వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాల్సి వుంటుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉంటే నేడు అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైఎస్ జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రాంకీకి చెందిన చార్జ్ షీట్ లో డిశ్చార్జ్ పిటిషన్ పై నేడు వాదనలు కొనసాగాయి. ఆపై కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఒకవేళ భారతి కూడా కోర్టుకు హాజరయ్యే పక్షంలో రాజకీయంగా ఇది జగన్ కు అతి పెద్ద మైనస్ గా అవతరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.