జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే.. రాపాక వరప్రసాద్ ఎన్నికైన కొన్ని నెలలోనే అధికార పార్టీకి దగ్గర అయ్యారు. ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా సొంత పార్టీని, అధినేతని ఇబ్బంది పెట్టడమే. అయితే ఆయనను ఏమీ చెయ్యలేక పవన్ కళ్యాణ్ నీళ్లు వదిలేసుకున్నారు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే అధికారికంగానే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోతారు కాబట్టి అది కూడా చెయ్యలేదు.
ఇప్పుడు అదే స్థితిలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. పార్టీ రెబెల్ ఎంపీ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పార్టీని విభేదించినందుకు షో కాజ్ నోటీసు ఇచ్చారు. అయితే అది కూడా రివర్స్ అయిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ఈరోజు కలిశారు.
తనకు జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటుపై ఫిర్యాదు చేశారు. పార్టీ లెటర్ హెడ్ కాకుండా మరో పేరుతో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఏ పార్టీ పేరు మీద సంజాయిషీ కోరుతున్నారు… పార్టీ క్రమశిక్షణ కమిటీ చేయాల్సిన పనిని జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా చేస్తారు.. అసలు ఒక రాష్ట్ర పార్టీకి జాతీయ కార్యదర్శి ఉండటం ఏమిటి.. అంటూ ‘రూల్స్’ వల్లించారు.
ఇప్పుడు ఆ తప్పులు అన్నీ సరిదిద్దుకుని… మళ్ళీ నోటీసు ఇస్తే అనవసరంగా అభాసుపాలు కావడం ఖాయం. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ఆయనకు ఎవరూ సమాధానం చెప్పకుండా… ఆయనకు మీడియా కవరేజ్ లేకుండా చేస్తే మంచిది. మొత్తానికి జగన్ కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని ఫాలో అవ్వాల్సిందే.