2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. రాయలసీమలో అయితే కేవలం మూడే సీట్లు గెలిచింది. అందులో ఒకటి చంద్రబాబు కాగా… మరో రెండు బాలయ్య, పయ్యావుల కేశవ్. బాలయ్య 2014 మెజారిటీ కంటే మెరుగైన మెజారిటీ తో గెలవడం విశేషం. అదే సమయంలో చంద్రబాబు మెజారిటీ కూడా తగ్గింది.
హిందూపురం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట… ఆ కోట ని బద్దలుకొట్టడానికి 2019 ముందు వైఎస్సార్ కాంగ్రెస్ చాలా ప్రయత్నించింది. బాలయ్య మీద సోషల్ మీడియాలో గట్టిగా ఎటాక్ చేసింది. అయినా పని అవ్వలేదు. ఇంకా జగన్ పట్టువీడలేదు. బాలయ్య మీద పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ ఇక్బాల్ కు రెండో సారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన గతంలో పోలీసు అదికారిగా పనిచేశారు.
చాలాకాలం పాటు ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సెక్యూరిటీ అధికారిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత వివిధ హోదాలలో పనిచేసి ఐజిగా రిటైరయ్యాక వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. మామూలుగా అయితే ఆయన చంద్రబాబు వద్ద పనిచేశారు కాబట్టి ఆ పార్టీలో చేరతారేమో అనుకున్నారు. కానీ ఇక్బాల్ వైసిపిలో చేరడమే కాకుండా జగన్ అభిమానం చూరగొని ఎమ్మెల్సీ పదవి పొందారు.
ఇక్బాల్ ను హిందూపురం నుంచి శాసనసభ కు కూడా పోటీ చేయించారు. ఆయన ఓటమి చెందినప్పటికీ, మళ్లీ రెండో సారి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన కేబినెట్ లోకి తీసుకుని మంత్రిని చేసి… బాలయ్యను ఎదురుకోవడానికి శక్తిని ఇవ్వాలని జగన్ ఆలోచనట. అయితే 2024లోనైనా హిందూపురం కోటను బద్దలుకొడతారేమో చూడాలి.