దాదాపుగా రెండు సంవత్సరాలుగా పాదయాత్ర అని, ఎన్నికల ప్రచారం అని బిజీగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పోలింగ్ తరువాత నుండి రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే సతీసమేతంగా స్విట్జర్లాండ్ వెళ్లొచ్చారు. ఈ రోజు ఆయన లండన్ బయల్దేరి వెళ్తున్నారు, అక్కడ చదువుకుంటున్న తన కుమార్తెతో కొద్ది రోజులు ఉండి 17వ తారీఖున తిరిగి వస్తారు. ఇది ఇలా ఉండగా నిన్న సాయంత్రం జగన్ హాలీవుడ్ సినిమా అవెంజర్స్ – ఎండ్ గేమ్ వీక్షించారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గల ఏఎంబీ సినిమాస్ లో సినిమా చూశారు. ప్రముఖ నటుడు మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో పార్టనర్ కావడం విశేషం. జగన్ తో పాటు ఆయన సతీమణి, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. జగన్ ను చూసి అక్కడ ఉన్న జనం సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ల్ కోసం ఎగబడ్డారు. మే 23న వచ్చే ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే వచ్చే ఐదు సంవత్సరాలు జగన్ బిజీగా గడపనున్నారు. కుటుంబంతో గడిపే తీరిక ఉండదు.
దీనితో ఇప్పుడే ఆయన కుటుంబానికి వీలైనంత ఎక్కువ సమయం ఇస్తున్నారు. పోలింగ్ తరువాత ఒకటి రెండు సందర్భాలలో తప్ప జగన్ రాజకీయ వేదికల పై కనపడింది లేదు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పక్క రాష్ట్రాలలో పర్యటనలు, ప్రచారం అంటూ బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల తరువాత జగన్ ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న విడుదల కాబోతున్నాయి.