YS_Jagan_Visakhaptnam_Capital_Shifting.jpgవిశాఖ రాజధానికి వైసీపీ ప్రభుత్వం పెట్టుకొన్న ముహూర్తాలు ఏవీ పనిచేయడం లేదు. కనుక మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి మరో కొత్త విషయం చెపుతున్నారిప్పుడు. నేడు కాకపోతే రేపు… ఎల్లుండి లేదా భవిష్యత్‌లో ఏదో ఓ రోజు విశాఖ రాజధాని అవడం ఖాయం. కానీ అంతవరకు వేచి చూడకుండా సిఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులలోనే విశాఖకు షిఫ్ట్ అయిపోతారని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. నెలలు కాదు… కొన్ని రోజులే అని అన్నారు కనుక బహుశః ఈ నెల 20-22వ తేదీలోగా సిఎం జగన్‌ విశాఖకు తరలివచ్చేస్తారని భావించవచ్చు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఒకటి రెండుసార్లు ఉగాది ముహూర్తాలు ప్రకటించింది కనుక ఈ నెల 22న ఉగాది రోజున జగన్‌ విశాఖలో కొత్తగా ఏర్పాటవుతున్న తన అధికారిక నివాసంలో గృహాప్రవేశం చేస్తారేమో?

“సిఎం జగన్‌ విశాఖకు మారితే ఆయన ఇంటి చిరునామా మారుతుందేమో కానీ ఏపీ రాజధాని కాదననే” వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే రాజధాని అంశంపై త్వరగా విచారణ చేప్పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా సుప్రీంకోర్టు తొందరపడటం లేదు. దీనిలో చాలా రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి కనుక లోతుగా విచారణ జరపాల్సి ఉంటుందని కనుక విచారణకు కొంత సమయం పడుతుందని జస్టిస్ జోసఫ్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణని మార్చి 28వ తేదీన చేపడతామని, ఎట్టి పరిస్థితులలో దానిని ముందుకు జరుపలేమని, అలాగే విచారణను మరుసటి రోజులకు పొడిగించలేమని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఏపీ రాజధాని పంచాయతీ ఇప్పట్లో తేలేదికాదన్న మాట!

ఈ విషయం జగన్ ప్రభుత్వానికి బాగానే అర్దం అయిన్నట్లుంది. కనుక ఇప్పుడు ఈ కొత్త ఆలోచన చేస్తున్నట్లుంది. ఎందుకంటే, టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోకుండా ఉంచేందుకు వైసీపీ విఫలయత్నాలు చేసింది కానీఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖయం అయ్యింది. కనుక వాటిని రాజకీయంగా దెబ్బ తీయాలంటే వైసీపీకి ఈ మూడు రాజధానుల అస్త్రమే శరణ్యం.

అమరావతే రాజధాని అంటున్న టిడిపి, జనసేనలు ఈ మూడు ప్రాంతాల ప్రజలకి అన్యాయం చేయాలనుకొంటున్నాయని వైసీపీ గట్టిగా ప్రచారం చేసుకోవాలంటే, ముందు తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని నిరూపించుకోవలసి ఉంటుంది. కనుక ముఖ్యమంత్రి జగన్‌ విశాఖకు మకాం మార్చి అక్కడి నుంచి పాలన పేరుతో హడావుడి చేస్తున్నట్లయితే వైసీపీ మూడు రాజధానుల వ్యూహం ఫలించవచ్చని భావిస్తున్నట్లుంది.

కానీ రాష్ట్ర హైకోర్టు అందుకు అంగీకరిస్తుందా?సుప్రీంకోర్టు రాజధాని అంశంపై విచారణ జరుపుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం విశాఖని రాజధానిగా ఖరారు చేయడం కోర్టు ధిక్కారం అవుతుంది కదా?అప్పుడు జగన్ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టుకి ఏమని చెప్పుకొంటుంది?అనే ప్రశ్నలన్నిటికీ సిఎం జగన్‌ విశాఖకు మకాం మార్చిన తర్వాత సమాధానాలు లభించవచ్చు.