వివేకా కేసు పై ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వ్యవహరిస్తున్న తీరు పై వివాదాలు చెలరేగుతున్నాయి. ఒక వైపు సిట్ ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కి వచ్చి అరెస్టులకు సిద్ధం అవుతున్న తరుణంలో సునీతారెడ్డి దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపణ. ఇప్పటికే ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టిన ఆమె ఎన్నికల కమిషన్ దగ్గరకు కూడా వెళ్లారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖను కలవనున్నారు. వెళ్లిన ప్రతీ చోటా ఆమె జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చి చంద్రబాబుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ విచారణను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. కనీసం వివేకా చివరి కార్యక్రమాలు కూడా పూర్తి కాకుండా రాజకీయ బెనిఫిట్ కోసం ఆమెను జగన్ వాడుకోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. జగన్ ఇటీవలే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని హై కోర్టులో పిటిషన్ వేశారు ఇప్పుడు సునీతారెడ్డి కూడా అదే కావాలని అడగడం విశేషం. ఎన్నికల సమయంలో ప్రజలలో పలచన అవ్వకూడదని జగన్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల వల్లే ఈ హత్య జరిగిందని సిట్ అభిప్రాయపడుతుంది. ఈ కేసులో జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వరెడ్డి, కిరాయి హంతకులు శేఖర్రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం లోపల కొందరు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.