చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పోరాటం చెయ్యడంలో జగన్ కు చాలా మంది పరోక్షంగా సాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో పని చేసి పదవీ విరమణ తరువాత బయటకు వచ్చి ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగిపోతున్నాయి అని నిందించినవారు ఉన్నారు. ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం వంటి వారు చంద్రబాబు ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించారు. తమని తాము ఏ పార్టీకు సంబంధించిన వారిమి కాదని విమర్శలు చేసి ఆ తరువాత తమ నిజస్వరూపం చూపించారు.
ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో చేరిపోయారు. అజయ్ కల్లం ఎన్నికల వరకూ ఆగి ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ కౌంటింగు ఏజెంట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు జగన్ ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ హోదా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వైఎస్ కేసులలో నిందితుడైన ఆయనను చివరి నిముషంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి ఎన్నికల సంఘం ద్వారా కేంద్రం పంపింది.
నియమింపబడ్డ చాలా రోజులవరకూ ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. రివ్యూ మీటింగులకు కూడా వెళ్ళలేదు. అయితే ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకముందే జగన్ ను కలిసి కంగ్రాట్స్ చెప్పారు. ఆయనను మెచ్చి పదవీ విరమణ వరకూ చీఫ్ సెక్రెటరీగా కొనసాగించనున్నట్టు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ కౌంటింగు ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చిన మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ కూడా ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇవ్వనున్నట్టు సమాచారం.