ఆంధ్రప్రదేశ్ లో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26, 27న గుంటూరులో దీక్షకు దిగుతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి లేటెస్ట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీక్షల పేరుతో జగన్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, తమ పార్టీ కూడా రాష్ట్రంలో ఉందని తెలపడానికే, తమ ఉనికిని చాటుకోవడానికే జగన్ దీక్షలు చేస్తుంటారని సోమిరెడ్డి విమర్శించారు.
తమ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ జగన్ ఇలా ఎందుకు దీక్షలు చేస్తుంటారో తమకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని సోమిరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా ఇలా దీక్షలకు దిగడం సరికాదని, రాయలసీమకు నీరు అందిస్తున్నందుకు, అక్కడి రోడ్లు బాగుపడుతున్నందుకు జగన్ దీక్షకు దిగుతున్నారా? అంటూ సోమిరెడ్డి చురకలంటించారు. అయితే అప్పుడప్పుడు జగన్ ఇలా దీక్షలకు దిగడానికి ఓ ప్రధాన కారణం ఉందని చెప్పారు.
నాలుగైదు నెలలకొకసారి కనీసం రెండు రోజుల పాటు ఓ సారి ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుంటుందని జగన్ కి వైద్యులు సూచనలు చేశారని, అందుకే జగన్ ఇలా చేస్తుంటారని సోమిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వైద్యుల సూచనల ప్రకారమే నడుచుకుంటూ జగన్ దీక్షల పేరుతో రెండు రోజులు ఇలా చేస్తుంటారని అన్నారు. ఈ నెల 26న ఉదయం దీక్షకు కూర్చొని 27 సాయంత్రం దీక్ష విడిస్తే ఆరోగ్యం బాగుంటుందని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చేస్తోన్న కృషి వల్ల రైతులు ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడ్డారని అన్నారు.