టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. తెలంగాణాలో అస్తిత్వం లేని వైకాపాకు ఆయనతో పని ఏంటి అనుకుంటున్నారా?
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరించింది. ఏపీలో వాడవాడకు తిరిగి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా అని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి వస్తే పార్టీ పరంగా అన్ని విధాలుగా సహకరిస్తాం అని చెప్పడానికి వెళ్లారట విజయసాయిరెడ్డి.
అయితే ఆయన వస్తున్న విషయం ఎలాగో మీడియాకు లీక్ కావడంతో ఆయన మోత్కుపల్లిని కలవకుండానే వెళ్లిపోయారట. మోత్కుపల్లి తన భవిష్యత్ కార్యక్రమంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కొనియాడుతున్న ఆయన టీఆర్ఎస్లో చేరుతారన్నవార్తలు వచ్చాయి.