ys jagan-pawan kalyanబెంగుళూరులో బంధుమిత్రుల సమక్షంలో జరిగిన చిరంజీవి రెండవ తనయురాలి వివాహం శ్రీజ రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా నిర్వహించారు. అతిరధ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మొదలు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు హాజరు కాగా, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, బ్రహ్మానందం, శ్రీకాంత్, గోపీచంద్, అలీ, కైకాల సత్యనారాయణ వంటి నటులు, దాసరి నారాయణరావు, రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాధ్, శ్రీను వైట్ల, గుణశేఖర్, కోడి రామకృష్ణ వంటి దర్శకులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో హైలైట్ అయ్యింది మాత్రం వైసీపీ అధినేత జగన్ మరియు మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే… ప్రధానంగా హాజరు కావాల్సిన జాబితాలో వీరిద్దరూ మిస్ కావడంతో రిసెప్షన్ కు వచ్చిన అతిధులు వీరి గురించే ఎక్కువ చర్చించుకోవడం విశేషం.

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ పాటల చిత్రీకరణ నిమిత్తం పవన్ విదేశాలలో ఉన్న విషయం తెలిసిందే. అయితే పెళ్ళికి హాజరు కాలేదు గనుక, రిసెప్షన్ సమయానికి పవన్ చేరుకుంటారేమోనన్న టాక్ వెలువడింది గానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇక, వైసీపీ అధినేత ఏ కారణాలతో హాజరు కాలేదన్నది కూడా తెలియరాలేదు. మొన్నటి దాకా అసెంబ్లీ సమావేశాలతో బిజీగా ఉండడమే కారణమా? అయితే వేడుక మాత్రం అంగరంగ వైభవంగా మెగాస్టార్ రేంజ్ లో అద్భుతంగా జరిగింది.