ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం భజనపరులకు దండిగా ముట్టచెబుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ కోసం, సాక్షి కోసం ఎన్నికల ముందు పని చేసిన వారిని పెద్ద ఎత్తున సలహాదారులుగా నియమించుకుని లక్షలలో జీతాలు ఇస్తున్నారు. అసలు ఉన్న సలహాదారులు అందరి నుండి సలహాలు వినడానికి జగన్ కు ఐదేళ్లు సరిపోతాయా అనే అనుమానం కూడా వస్తుంటది.
ఇక ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి భజనపరులకు డబ్బులు దార పోస్తున్నారు. టూరిజం, సాంస్కృతిక శాఖ తాజాగా ఒక జీవో విడుదల చేసింది. కళలు, సంస్కృతి పరిరక్షణలో భాగంగా గత ఏడాది నవంబర్ లో ‘జగన్ జయ కేతనం’ అనే నాటకం ఎక్కడో పదిసార్లు ప్రదర్శించారట. ముఖ్యమంత్రి కీర్తిని దశదిశలు వ్యాపింపచేశారట.
అందుకోసం ఏకంగా ఐదు లక్షలు ప్రభుత్వ ఖజానా నుండి విడుదల చేశారట. ఒరిజినల్ బిల్లు సమర్పించి డబ్బులు తీసుకోండి అంటూ జీవోలో పేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా దుస్థితికి ఇది అర్ధం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కరోనా ఎఫెక్ట్ అంటూ… రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సగమే ఇస్తున్నారు. వచ్చే నెల కూడా అనుమానమే అంటున్నారు. నవరత్నాలకు డబ్బులు లేవు అని ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నారు. అయితే భజనపరులకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర ఏ లోటు లేదు.