సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. మంగళవారం ఢిల్లీలో లీలా ప్యాలస్ హోటల్లో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆ సదస్సుకి హాజరయ్యే వివిద దేశాల దౌత్యవేత్తలతో కూడా సమావేశమవుతారు. సదస్సు ముగిసిన తర్వాత వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం చేరుకొంటారు.
ఈసారి పర్యటనలో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలని కలుస్తారా లేదా?అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. ఈ నెలాఖరు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున, బడ్జెట్లో ఏపీకి తగినన్ని కేటాయింపులు చేయాలని కోరుతూ ఏపీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు ఢిల్లీలో మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. కనుక బడ్జెట్కి ముందే సిఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలవడం చాలా అవసరమే.
వారి అపాయింట్మెంట్ లభిస్తే కలిసి ఏపీకి పెండింగులో ఉన్న ప్రాజెక్టులకి అనుమతులు, నిధులు బడ్జెట్లో కేటాయించవలసిందిగా కోరనున్నారు. మరో రెండు రోజులలో మళ్ళీ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి జీతాలు, పెన్షనర్లకి పెన్షన్లు చెల్లించాల్సి ఉంటుంది. వాటికీ నిధులు అవసరం. కానీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ అమిత్ షా ఇరువురూ బడ్జెట్ సమావేశాల హడావుడిలో ఉన్నందున సిఎం జగన్కి వారి అపాయింట్మెంట్ లభిస్తుందో మంగళవారం నాటికి తెలిసే అవకాశం ఉంది.