ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ శనివారం సీఎం నివాసంలో దాదాపుగా గంటన్నర పాటు సమావేశం అయ్యారు. ముకేశ్, తనయుడు అనంత్ అంబానీతో కలిసి ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వారికి స్వాగతం పలికి ముఖ్యమంత్రి నివాసానికి తోడ్కొని వెళ్లారు.
ముకేశ్ వెంట రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు నత్వానీ పరిమల్ వచ్చారు. రాష్ట్రంలో రిలయన్స్ తరపున పెట్టుబడుల గురించి జగన్ ఆయనతో చర్చించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని వదంతులు వినిపిస్తున్నాయి.
నత్వానీ పరిమల్ ఇప్పటికీ రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన తొందరలో రిటైర్ కాబోతున్నారు. గతంలో రెండు సార్లు ఆయన బీజేపీ ఝార్ఖండ్ ఎమ్మెల్యేల సపోర్టుతో పెద్దల సభకు వెళ్లారు. ఈసారి బీజేపీకి ఉన్న రాజకీయ అవసరాల వల్ల ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుతో రాజ్యసభకు పంపాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది.
డైరెక్టుగా మద్దతు ఇస్తే అది రాజకీయంగా ఇబ్బంది కాబట్టి… అంబానీతో వచ్చారు. అంబానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి అందుకు ప్రతిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు నత్వానీ పరిమల్ కు మద్దతు ఇస్తున్నాం అని వైఎస్సార్ కాంగ్రెస్ చెప్పుకునే అవకాశం దక్కుంతుంది.