ఏపీలో గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో కేబినెట్ లో ఖాళీ ఏర్పడింది. కాగా ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వైసీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖాళీ ఏర్పడటంతో.. దానికి కూడా పోటీ పెరుగుతోంది వైసీపీలో. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన వారయితే.. తమకే వస్తుందంటూ ఇప్పటికే సంబురాలు చేసుకుంటున్నారంట. కానీ జగన్ వారందరికీ షాక్ ఇవ్వబోతున్నారని తెలిసింది.
తనకు రాజకీయంగా మొదటి నుంచి అండగా ఉంటున్న మేకపాటి కుటుంబానికే పెద్దపీట వేయాలని జగన్ భావిస్తున్నారంట. అందుకే గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలను కూడా వారి కుటుంబంలోని వ్యక్తికే అప్పగించి కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఎలాగూ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు కాకుండా.. గౌతమ్ రెడ్డి భార్యకు ఇవ్వాలని జగన్ చూస్తున్నారంట.
సింపతీతో పాటు.. ఎన్నికల్లో ఏకగ్రీవం అవుతాయనే ఆలోచన జగన్ ది. గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి ఒప్పుకుంటే గనక ఆమెను కేబినెట్ లోకి తీసుకుంటారు. ఆమె కేబినెట్ మంత్రి అయిన ఆరు నెలల్లోపు శాసనసభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆత్మకూరు స్థానం ఖాళీ అయిపోయిందని కేంద్రానికి సమాచారం వెళ్లింది. శ్రీకీర్తి గౌతమ్ స్థానంలో వైసీపీ తరఫున పోటీకి దిగితే.. సాంప్రదాయం ప్రకారం టీడీపీ, జనసేనలు పోటీ చేయవు. అప్పుడు ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.
ఒకవేళ ఇతరులకు కేబినెట్ మంత్రి పదవి ఇస్తే.. ఆత్మకూరులో పోటీ చేసేందుకు శ్రీకీర్తి ముందుకు రాకపోవచ్చు. కాబట్టి జగన్ ఈ ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది. ఇక నెల్లూరు ఆశావహులతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించాడు జగన్. 3, 4 తేదీల్లో సజ్జల వారితో భేటీ అవుతారు.
7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 8వ తేదీన గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశ పెడుతారు. ఆ సందర్భంగానే జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక శ్రీకీర్తిని కేబినెట్ లోకి తీసుకునేంత వరకు గౌతమ్ రెడ్డి నిర్వహించిన మూడు శాఖలను బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు చూసుకుంటారు. మొత్తానికి రెండు వైపులా తనకు మేలు జరిగే నిర్ణయాన్ని జగన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.