YS Jagan Mohan Reddy comments on Chandrababu naiduతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వద్ద ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు చెందిన పూర్తి అవినీతి జాతకం ఉందని, ఆ కారణంగానే కేసీఆర్ కు బాబు ఎదురు వెళ్లడం లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఓటుకు నోటు కేసు’లో చంద్రబాబుకు సంబంధమున్న ఆడియో, వీడియో సాక్ష్యాలు కేసీఆర్ వద్ద ఉన్నాయని, అవి ఏ రోజు బయటకు వచ్చినా, బాబు కటకటాల వెనక్కు వెళ్లాల్సి వస్తుందని, అందుకు భయపడే, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగేలా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోవాలన్న ఆలోచన లేకుండా ఉన్నారని ఆరోపణలు చేసారు.

కృష్ణా నీటిని కేసీఆర్ ఆపుతుంటే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగిన జగన్, రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఈ ఆరోపణలు, విమర్శలు జగన్ ఈ రోజు కొత్తగా చేసున్నవి కావు. చంద్రబాబును విమర్శించే ప్రతి సమయంలోనూ జగన్ కు గుర్తుకు వచ్చే ఏకైక అంశం ‘ఓటుకు నోటు’ కేసు. ప్రజా సంక్షేమం కన్నా, తన రాజకీయ లబ్ది కోసమే జగన్ ఈ ఆరోపణలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళడంతో జగన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత దక్కడం లేదు.

అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం రకరకాల కౌంటర్లు, సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. జగన్ చెప్పినట్లుగా చంద్రబాబు జాతకం కేసీఆర్ వద్ద ఉంటే… మరి జగన్ జాతకం ఎవరి దగ్గర ఉన్నట్టు? ‘స్పెషల్ స్టేటస్’ అంశంపై నిజంగా ప్రశ్నించాల్సిన మోడీ వద్ద ఉన్నట్టా? లేక రాబోయే కాలానికి కాబోయే కింగ్ నువ్వే అంటూ చెప్పిన జ్యోతిష్కుని దగ్గర ఉన్నట్టా? లేక సీబీఐ కోర్టుల వద్ద.., అదీ గాక ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వద్ద… ఇలా ఎవరి వద్ద ఉన్నదో చెప్తే సంతోషించే వారము కదా… అన్న రీతిలో జగన్ పై పడుతున్న సెటైర్లు కోకొల్లలు. ఒక వేలు చూపిస్తే… మిగిలినవి మనకే చూపిస్తాయి అన్న నీతి సూత్రం తెలియాలి కదా జగన్..!