దేశంలో మరే రాష్ట్రంలోను లేనన్ని సంక్షేమ పధకాలు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయి. కనుక రాష్ట్రంలో ప్రజలందరూ తన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పుకొంటుంటారు. కానీ అదంతా జగనన్న భ్రమ అని చెపుతోంది సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే (సీఎన్వోఎస్) తాజా సర్వే నివేదిక.
జగనన్న తన ఆత్మసాక్షి మీడియాతో సర్వే చేయించుకొని ఉంటే దేశంలోను… ఇంకా చెప్పాలంటే ఈ భూమండలంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రులలో ఆయన పేరు నంబర్: 1 స్థానంలో ఉండేదేమో కానీ అత్యున్నత ప్రమాణాలతో సర్వే చేసే సంస్తంగా పేరొందిన సీఎన్వోఎస్ తాజా సర్వే నివేదిక ప్రకారం జగనన్న 21వ స్థానంలో ఉంది!
సీఎన్వోఎస్ విడుదల చేసిన తాజా సర్వే నివేదిక ప్రకారం దేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నంబర్:1 స్థానంలో నిలువగా, ఆ తరువాత స్థానాలలో యోగి ఆధిత్యనాథ్ (యూపీ), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర మాజీ సిఎం), హిమంత్ బిశ్వ శర్మా (అస్సామ్), భగవంత్ సింగ్ మాన్ (పంజాబ్) నిలిచారు.
ఆ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 11వ స్థానంలో నిలువగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 20వ స్థానంలో నిలిచారు.
ఆంద్రప్రదేశ్లో 39 శాతం మంది ప్రజలు జగనన్న పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయగా, 29 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 32 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఇష్టపడలేదు.
తెలంగాణ రాష్ట్రంలో 49 శాతం మంది ప్రజలు తమ సిఎం కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయగా, 19 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 24 శాతం మంది తటస్థంగా ఉండిపోయారు.
మూడేళ్ళ క్రితం జగనన్న ఆంద్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యం స్థాపించారు. తొలి రోజు నుంచి నేటికీ నెలనెలా సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు జనాలకు పంచుతూనే ఉన్నారు. కనుక ఖచ్చితంగా జగన్కు జనాధారణ పెరిగి ఉండాలి. కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంత అంటే 49 శాతం మంది అయినా సంతృప్తి వ్యక్తం చేసి ఉండాలి కానీ కేవలం 39 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటి? అంటే సంక్షేమ పధకాల కోసం ఖర్చు చేసిన లక్షల కోట్లు ఏట్లో పిసికిన చింతపండేనా? ఏమో?