ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను చాలా అట్టహాసంగా నిర్వహించాలని జనసేన భావిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ తరుణంలో ఈ సభ నిర్వహించుకోవడానికి ఏపీ సర్కార్ అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది.
దీంతో ఆగ్రహించిన జనసేన హైకోర్టును ఆశ్రయించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు. గురువారం నాడు హైకోర్టులో జనసేన తరపున పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లుగా నాదెండ్ల అధికారికంగా ప్రకటించారు.
జనసేన సభకు అనుమతులు నిరాకరించడంపై అభిమానులు సోషల్ మీడియాలో గుర్రుగా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక సభలతో పాటు 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన జగన్ ఉదంతాన్ని ఈ సందర్భంగా జనసైనికులు గుర్తు చేస్తూ వైసీపీ తీరుపై మండిపడుతున్నారు.
సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ఓ రాజకీయ పార్టీగా జనసేనకున్న ప్రజాస్వామ్య హక్కు. దానిని నిర్బంధించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రం తగదనేది జనసేన అభిప్రాయం. అయినా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ అంటే జగన్ కు ఎందుకంత భయం? అన్న కోణంలో కూడా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
2014లో వైసీపీ అధికారం దూరం కావడానికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా కారణమయ్యారు గనుక, మళ్ళీ అలాంటి అవకాశాన్ని పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తీసుకునే చర్యలలో భాగమే ఇదని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అధికారం అడ్డం పెట్టుకుని తీసుకుంటున్న వైసీపీ నిర్ణయాలపై ఇప్పటివరకు చాలామంది కోర్టుకు వెళ్లి తమకు కావాల్సింది సాధించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు ఉదంతంతో సహా రాజధాని వంటి పలు కీలక అంశాలలో హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర సర్కార్ పాటించాల్సి వచ్చింది. దీంతో జనసేన కూడా హైకోర్టునే నమ్ముకుంది.