ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు నిజంగా ఒక్క అమరావతి ప్రాంతాన్నే అభివృద్ధి చేయాలనుకున్నారా? నాడు హైదరాబాద్ లో జరిగిన తప్పులను సరిదిద్దుకోలేదా? అసలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వలేదా?

అలాగే 2019లో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రెండేళ్లలో వికేంద్రీకరణ పేరుతో సాధించింది ఏంటి? రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి చేసారు? ఈ రెండింటిని గమనిస్తే… నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరు సరైన బాటలు వేసారో అర్ధమవుతుందని అనిపించే విధంగా సోషల్ మీడియాలో ఉన్న ప్రముఖులు విశ్లేషణలు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో…

1. అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) – మంగళగిరి
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) – తిరుపతి
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ – తిరుపతి
4. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓషన్ టెక్నాలజీ – నెల్లూరు
5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ – నెల్లూరు
6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ
7. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (నిట్) – తాడేపల్లిగూడెం
8. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ – విజయవాడ
9. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ – విశాఖపట్నం
10. ట్రైబల్ యూనివర్సిటీ – విజయనగరం
11. సెంట్రల్ యూనివర్సిటీ – అనంతపూర్
12. నేషనల్ అకాడమీ అఫ్ కస్టమ్స్, ఎక్సయిజ్ అండ్ నార్కోటిక్స్ – అనంతపూర్
13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్) – కర్నూల్

ఇవేమీ కాకి లెక్కలు కాదు. చంద్రబాబు ప్రభుత్వంలో కేంద్ర సంస్థలను వివిధ ప్రాంతాలకు విస్తరిస్తూ ఏర్పాటు చేస్తూ అసలైన వికేంద్రీకరణకు నాంది పలికారన్నది ఆయా ప్రముఖులు చెప్తున్న సంగతులు. అలాగే పారిశ్రామికంగా కూడా కియా వంటి అనేక పెద్ద, చిన్న పరిశ్రమలను ఆయా ప్రాంతాల వారీగా ప్రోత్సాహకాలు ఇచ్చి ఏర్పాటు చేయడం వలనే ఈనాడు రాష్ట్రానికి ఆదాయం వస్తోందన్నది ఇందులో ఉన్న సారాంశం.

జగన్ సర్కార్ లో…

2019లో చంద్రబాబు నుండి అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ‘వికేంద్రీకరణ’ పేరుతో ఏం సాధించారు? అంటే… అసెంబ్లీ సమావేశాలలో ‘వికేంద్రీకరణ’ పేరుతో ‘అభివృద్ధి’ చేస్తామని చెప్తూ ఉన్నారు. ‘వికేంద్రీకరణ’ పేరుతో మరో రెండు ప్రాంతాలకు ‘రాజధాని’ ట్యాగ్ ను అనుసంధానించి, ప్రాంతీయ విభేదాలకు తావిచ్చారనేది ఇటీవల హైకోర్టు కూడా ప్రస్తావించిన అంశం.

అధికారం చేపట్టి రెండున్నర్రేళ్ళు గడిచినా… ఇంకా వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కార్ రాజకీయాలు చేస్తుండగా, 2014 నుండి 2019 సమయంలో పడిన ‘వికేంద్రీకరణ’ పునాదులను ప్రస్తుత ప్రభుత్వం సరిగా వినియోగించుకున్నట్లయితే… “వికేంద్రీకరణ” అనే అంశం పాలనలో ఇప్పటికే భాగమై ఉండేదని రాజకీయ పండితుల వ్యాఖ్య.